జూన్ నెలలో రాష్ట్రానికి రూ.11 వేల కోట్ల రాబడి వచ్చింది. జీఎస్టీ రాబడుల్లో పదిశాతం, ఎక్సైజ్ రాబడుల్లో సుమారు 25 శాతం పైగా వృద్ధిరేటు నమోదైంది. రిజిస్ట్రేషన్ల రాబడి దాదాపు సాధారణ స్థితికి చేరుకుంది. ఇంకా అమ్మకం, వాహన పన్నుల రాబడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి నెల ఆదాయం రూ.11 వేల కోట్లు దాటింది. ఈ మొత్తంలో కేంద్రం నుంచి పన్నుల వాటా రూ.982 కోట్లు, బాండ్ల ద్వారా రెండు విడతలుగా సమీకరించిన రూ.4,500 కోట్లు కూడా ఉన్నాయి.
ఈ నెలలో మరింత మెరుగ్గా
హైదరాబాద్లో లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో దాదాపు అన్ని కార్యకలాపాలు మొదలయ్యాయి. ఫలితంగా పన్నుల రాబడులు పెరిగాయి. సొంత పన్నుల రాబడిలో సాధారణ పరిస్థితులు నెలకొంటుండటం ఊరటను ఇచ్చే అంశమని ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తివేతనాలు, రైతుబంధు, రుణమాఫీ, ఆసరా పింఛన్లు, రుణాలు, వడ్డీల చెల్లింపు సహా వివిధ కార్యక్రమాలకు నెలకు విధిగా రూ.12 వేల కోట్ల దాకా అవసరం. ఈ నేపథ్యంలో జూన్లో ఖజానాకు రూ.11 వేల కోట్లు సమకూరడం ఊరటను కలిగిస్తోందని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. జులైలో రాబడుల పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుందని, ఖజానా కష్టాలు గట్టెక్కుతాయని అభిప్రాయపడ్డారు.
రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.850 కోట్లు
రిజిస్ట్రేషన్ల రాబడి సగటున నెలకు రూ.833 కోట్లు వస్తుందని అంచనా వేయగా జూన్లో రూ.850 కోట్లు రావడం ప్రస్తావనార్హం. ఆ నెలలో లాక్డౌన్ నిబంధనల సడలింపు, పూర్తి సిబ్బంది విధుల్లోకి రావడం వంటి పరిస్థితులు ఆదాయం పెరగడానికి దోహదపడ్డాయి. లాక్డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన ఆదాయం రూ.500 కోట్లే కావడం విశేషం.
ఒప్పందాలు(అగ్రిమెంట్లు) కుదిరి ఇంకా అనేక లావాదేవీలు పెండింగ్లో ఉన్నాయని వాటి రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ నెల(జులై)లోనూ రాబడులు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
గతేడాది కంటే 10 శాతం అదనం
రాష్ట్రంలో జూన్లో వాణిజ్య పన్నులశాఖ రాబడి రూ.3,755 కోట్లు వచ్చింది. ఇది గత ఏడాది జూన్లో వసూలైన మొత్తం కంటే పది శాతం అదనం కావడం గమనార్హం.